Thursday, December 17, 2009

ఉద్యమంపై వ్యాఖ్యానించే ముందు ఒక్క క్షణం

ఒక వైపు మహోధృతంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమంలో మా భూమిపుత్రులు తమ ప్రాణాలు తామే అర్పించుకుంటుంటే కొందరు సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకులు బ్లాగుల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. తెలంగాణా ఉద్యమం ఎందుకు జరుగుతుందో అనేక సార్లు వివరించినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయని వీరు కేసీఆర్ ను విమర్శించే నెపంతో తెలంగాణా ప్రజలను దూషిస్తున్నారు.
విధ్వంసం విధ్వంసం అని గుండెలు బాదుకుంటున్నవారు ఒక సారి అలోచించండి ఇప్పటికే 25 మంది యువకులు తెలంగాణ కొరకు తమ ప్రాణాలు తామే తీసుకున్నారు. తమ దేహాలను అగ్నిగోళాలుగా మార్చుకుని “జై తెలంగాణా” అని నినదిస్తున్నారు, ఉరి తాళ్లను ముద్దాడుతున్నారు, బుల్లెట్లను గుండెల్లో దింపుకుంటున్నారు, గరళాన్ని దిగమింగుతున్నారు, రైలు పట్టాలపై శిరచ్చేధం చేసుకుంటున్నారు, సెల్ టవర్లు, నీటి ట్యాంకులపై నుండి “జై తెలంగాణ” అని దుంకుతున్నరు.
ఇంకొక ప్రాణం కూడా వృధా కావొద్దు అని మేము ఇక్కడ విజ్ఞప్తులు, విన్నపాలు చేసుకుంటున్నాం.
మీకొకటే విజ్ఞప్తి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అందరికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉందీ దేశంలో. సమైక్య రాష్ట్రం ఎందుకు అవసరమో తప్పకుండా మీ అభిప్రాయాలను రాయండి. సమైక్యత సాధించడం కొరకు చేయాల్సిన కృషి తప్పకుండా చేయండి. కానీ ఒక్క నిముషం అలోచించండి. అసలే అవేశాలు రగులుతున్న ఈ సమయంలో మీరు చేసే ఈ అనాలోచిత వ్యాఖ్యలు వాతావరణాన్ని ఇంకా కలుషితం చేస్తాయి. అమెరికాలోనో, కెనడాలోనో కూర్చుని మీరో వెకిలి వ్యాఖ్య చేసి మీ నోటి కుతి తీర్చుకుని ఆనందపడవచ్చు. కానీ అలాంటి వ్యాఖ్యలు ఒక్కోసారి బడబాగ్నిని రగల్చవచ్చు. అది అమాయకులనే దహించివేస్తుంది.
అలాగే తెలంగాణా వాదులు కూడా సంయమనం పాటించాలి. ఆంధ్రా మిత్రులను దూషించి అనవసరంగా మన ఉద్యమంపై దురభిప్రాయం కలుగజేయరాదు. మన పోరు కోస్తాంధ్ర పాలకవర్గాలతోనే కానీ కోస్తాంధ్ర ప్రజలతో కాదని గుర్తెరగాలి.
సమైక్య రాష్ట్రం ఉండాలనుకోవడం తప్పుకాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ప్రజా ఉద్యమం. దీనిపై దయచేసి వెకిలి రాతలు రాయకండి.
మీకు ధ్వంసం అవుతున్న ఆస్థులు కనపడుతున్నాయి. మాకు ధ్వంసం అవుతున్న తెలంగాణా భవిష్యత్ తరంపై ఆందోళనగా ఉన్నది

No comments:

Post a Comment