Thursday, December 24, 2009

వేరెవర్‌ యూ గో!!!

“మరో ప్రపంచంమరో ప్రపంచంమరో ప్రపంచం పిలిచిందీ…”టీవీలో శ్రీశ్రీ పాట. స్టూడెంట్స్ క్యాంటీన్‌ అంతా వినబడుతోంది. వేడి వేడి చాయ్‌ తాగుతూ టీవీలో లీనమైపోయా.మధ్యలో తల పక్కకు తిప్పి చూసిన.నా పక్కనున్నోడు సూత్తండా లేదా అని!వాడు సూత్తలేడు…ఈ స్వీడనోడికి పుస్తకాల గోల తప్ప ఇంకేం పట్టేటట్టు లేదు.మనమే కదిలిస్తే పోలా!
“హే … బెంగ్త్‌, సీ దట్‌ సాంగ్‌. ఇటీజ్‌ ది మోస్ట్ పాపులర్‌ సాంగ్‌ ఇన్‌ తెలుగు” అని చెప్పిన.“ఓ ఈజ్‌ ఇట్‌ ట్రూ?”సందేహంగానే టీవీ వైపు చూశాడు.
“యస్‌ మ్యాన్‌. ఇట్స్ ఎ గైడింగ్‌ సాంగ్‌ ఫర్‌ అవర్‌ ప్రోగ్రెసివ్‌ పీపుల్‌ అండ్‌ మ్యూజిక్‌ లవర్స్‌”.నమ్మలేనట్టు కనుబొమ్మలెగరేశాడు బెంగ్త్‌.“ఇట్స్ ఓకే. హూ ఈజ్‌ ది రైటర్‌ ఆఫ్‌ దిస్‌ సాంగ్‌?” తర్వాతి ప్రశ్నను నా మీదికి సంధించాడు.
వీన్ని కదిలించి తప్పు చేశానా అనిపించింది. సర్లే ఏం చేస్తాం? తప్పదు.పాటను చూసుడు ఒదిలి “శ్రీశ్రీ” అని సమాధానం ఇచ్చిన.నా నుండి ఆ ఆన్సర్‌ వచ్చిందో లేదో “వాట్‌ ఈజ్‌ హిజ్‌ కాస్ట్‌?” మరో పిడుగు నా నెత్తిన పడింది.
వీడు భలే మొనగాడురా అయ్యా! ఎవల పేర్జెప్పినా వాళ్ల కులమడుగుడు వీనికి బాగా అలవాటైందని మనుసుల్నే అనుకున్న.“హీ ఈజ్‌ ఎ బ్రాహ్మిన్‌” అని ఎప్పుడైతే అన్ననో వీళ్ల అయ్య సొమ్మంతా శ్రీశ్రీ తిన్నట్లు మొకమంతా మాడ్చుకున్నడు.“హే, ఐ డోంట్‌ లైక్‌ బ్రాహ్మిన్‌ సాంగ్స్‌. ఐ లైక్‌ ఓన్లీ దళిత్‌ సాంగ్స్‌” భుజాలెగరేస్తూ సల్లగన్నడు.
నవ్వాల్నో ఏడ్వాల్నో సమజ్‌గాలె. ఈ తెల్లోడు మా దగ్గర్నే గిట్ల మాట్లాడుతడా? లేకపోతే నాన్‌ దళిత్స్ దగ్గర గూడ గిట్లనే ఉంటడో తెల్వలే! దళితుల మీద రీసెర్చ్ పేరుతో ‘సెంట్రల్‌ యూనివర్సిటి’కి వీడొచ్చినప్పటి నుండి సూత్తాన్న. గిదే వరస. సరే వీని శీలాన్ని ఎందుకు శంకించాలే? మనోడో, మందోడో ఓ తెల్లోడు ఇక్కడ చీకటి బతుకుల గురించి రీసెర్చ్ చేస్తున్నడు. ఇగ మనం గాకుంటే గీనికి ఎవడు హెల్ప్ జేస్తడు. మళ్లీ కలుస్తనని జెప్పి లైబ్రరీ దిక్కు కదిల్న. చెరగని చిరునవ్వు మొఖంతోటి బాయ్‌ బాయ్‌ అన్నడు.
***
ఆ రాత్రి అనిపించింది. రేపు ఎల్లుండి యూనివర్సిటి బంద్‌ కదా. ఓ సారి ఇంటి మొఖాన పొయొస్తె అయిపోద్ది. ఇంటికి పోక చాన దినాలాయె. అమ్మను నాయినను చూసి కష్టసుఖం ఇసారించొస్తే మంచిగుంటది. స్కాలర్‌షిప్‌ పైసల్‌ గూడ వచ్చినయ్‌. ఓ ఐదొందలు అవ్వకిత్తె అది దిల్‌ఖుష్‌ అయితదనుకున్న.చీకటితోటే లేచి ఆదరబాదర బ్యాగు సదురుకున్న. హాస్టల్ల టిపిన్‌ చేసి భుజానికి బ్యాగు తగిలిచ్చుకొని బైలెల్లిన. హాస్టల్లకెల్లి బైటికొత్తాంటె … బెంగ్త్ గాడు ఎదురైండు.‘ఇంటికి పోతాన, రెండ్రోజులల్ల వొస్తా, మల్లొచ్చినంక కలుద్దా’మన్న. ఏ ఊరు మీదని ఇంగ్లీషుల్నే అడిగిండు. ‘వరంగల్‌’ అన్న.
“ఐ థింక్‌ వరంగల్‌ ఈజ్‌ ఏ హిస్టారికల్‌ ప్లేస్‌?” అన్నడు. ఔ వీనికెట్ల తెల్సింది? అయినా గీ రోజుల్ల ఇంటర్నెట్‌ ఉన్నది. ప్రపంచంల ఏడ ఏమున్నదో క్షణంల తెల్సుకుంటున్నరు గదా!
“నేను గూడ మీ ఊరొస్త. అక్కడ నాక్కొన్ని ఇంటర్వ్యూలు దొరకొచ్చు. అట్నే మీ కుటుంబాన్ని గూడ సూసినట్టుంటది ఫ్రెండ్‌” అన్నడు.సరే, వాన్నెందుకు కాదనాలే. తొందరగ పోవాలె. లేటయితే ట్రేనెల్లి పోతదంటే ఉరికి, వాని రూములున్న బ్యాగుల ఓ బుల్లి కెమెరా, ఐపాడేసుకొని నాతోపాటొచ్చిండు.
***
పట్నంల ఎవ్వల్‌ బెంగ్త్‌ని పట్టించుకోలేగాని, మా వూళ్లె మాత్రం అందరు పరెషాన్‌గ చూస్తున్నరు. నేనేదో కోతిని పట్టుకొని తిరుగుతున్నట్టు గుసగుసలాడుతున్నరు. వాళ్ల ఆశ్చర్యం చూసి నాగ్గూడ నవ్వొచ్చింది. గింతల్నే బెంగ్త్ తనను చూసెటోళ్లను, నన్ను అర్థం చేసుకొని సిన్నగ నవ్విండు.
“వీళ్లంత నన్ను చూసి నవ్వి ఊరుకుంటున్నరు గాని, నాలుగేండ్ల కిందట నేను ‘ఇథియోపియా’ పోయినప్పుడు చూడాలె” అన్నడు బిక్కమొఖంతో.ఏం జరిగిందని ఇంట్రెస్టుతో అడిగిన.
“ఏమున్నది ఓ ముప్పై నలభై మంది బ్లాక్స్ చిన్నపిల్లలు నా యెంటబడి నేనెటుపోతె అటే వచ్చుకుంట ఫారినర్‌ … ఫారినర్‌ … అని అరుసుడు మొదలుపెట్టిండ్రు. ఇగ నేను సిగ్గుతో నవ్వలేక సచ్చాను” అని గొల్లుమన్నడు.ఇద్దరం నవ్వుల పువ్వులైనం.
***
రెండ్రోజులు మస్తుగ ఎంజాయ్‌ చేసినం. బెంగ్త్ నాన్‌వెజ్‌ తినననేటోడు. కాని మా అయ్య నాటుకోడిని కోస్తే, కారమున్న గూడ కిక్కురుమనకుండ కమ్మగ తిన్నడు. ఖిలా వరంగల్‌, వేయిస్తంభాల గుడి, కాకతీయుల కోట తిరిగి లెక్కలేనన్ని ఫోటోలు దిగినం. బెంగ్త్ సంబురానికి హద్దేలేదు. వరంగల్‌ మస్తు ఉందన్నడు. జీవితంల మరిచిపోలేనన్నడు. ఇగ ఆనందంగా మరుసటి రోజు పొద్దుగాల హైదరాబాద్‌ బైల్దేరినం. గోల్కొండ ట్రైన్‌ కోసం ప్లాట్‌ ఫాం మీదికొచ్చినం. పల్లికాయలు నముల్త ట్రైన్‌ కోసం ఎదురుసూసుకుంట బెంచీ మీద కూసున్నం. పల్లీలు పొట్లం కట్టిన కాగితం మీద ఓ అందమైన అమ్మాయి బొమ్మున్నది. బొమ్మకింద అక్షరాల్లో ఆమె పేరున్నది.
‘మొట్టమొదటి ప్రపంచ సుందరి ఈవిడే’నని హెడ్డింగ్‌ కనిపించింది. తెలుగులో ఉన్న మ్యాటర్‌ని సదివి బెంగ్త్‌కి ఇంగ్లీష్‌లోకి అనువదించి చెప్పిన. ఆ తరువాత అతని స్పందన చూసి ఆశ్చర్యపడ్డ -
“ఇట్స్ నాట్‌ ఏ సర్‌ప్రైజ్‌ మ్యాటర్‌, వీ నీడ్‌ దళిత్‌ మిస్‌ వరల్డ్‌”.
వాడి మాటలాగిపోయాయి. నాలో ఆలోచన మొదలైంది. అందాల పోటీలా..? దళితులకా? కనీసం మనిషిగా చూడని లోకంలో అందాల పోటీల కలలెలా వస్తాయి? అవమానాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు తప్ప ఇక్కడ మాకేం మిగిలిందని? లోపలెక్కడొ నా మనసు మూగగా రోదించింది. దళిత జీవితమంటే నిత్యం ఓ పచ్చిగాయాల కుండ కదా.
నేస్తమా, ఈ గడ్డమీద పుట్టలేదు గనుకే నువ్వు ఆ కల కనగలిగావు. మా కలలన్ని ఎప్పుడో కల్లలైపోయాయి. “యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌ …” రైల్వే అనౌన్స్‌మెంట్‌తో ఈ లోకంల కొచ్చిన.
జనాలు ఎక్కువగా ఉండటం వల్ల నేనే త్వరగా లోపలికెక్కి, సీట్‌ వెతికే పనిలో ఉన్న. జనరల్‌ కంపార్ట్‌మెంట్‌ అయ్యేసరికి హౌజ్‌ఫుల్‌ థియేటర్‌లా ఉంది గోల్కొండ. ఇంతలో బ్యాగ్‌లతో బెంగ్త్ “వాట్‌ హాప్పెండ్‌? నో సీట్స్ ఫర్‌ దళిత్స్‌?” అని చమత్కరించాడు.
వీడు సామాన్యుడు కాదురో నాయన అనుకున్న. ఈ దేశంల నిజాల్ని బహిరంగంగా మాట్లాడొద్దని వీడికి తెలియదు కదా! అలా దేవులాడుకుంట ముందుకు పొయినంక రెండు సీట్లు దొరికాయి. మాకంటే ముందే కూర్చున్న జనాలు బెంగ్త్ ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతని గురించి తెలుసుకోవాలనె కుతూహలంతో ఉన్నట్లు వాళ్ల ముఖాలు చెప్తున్నాయ్‌.
నా ముందు సీట్లో ఇస్త్రీ మడతలు చెదరని ఖద్దరు బట్టలేసుకున్న పెద్దమనిషి ఉన్నాడు. గంభీరమైన రూపంతో కళ్లద్దాలు సవరించుకొని మా యిద్దర్నే జాగ్రత్తగా చూస్తున్నాడు. వయసు యాభై పైనే ఉండొచ్చు. ఉండబట్టలేక “గీనెదెక్కడ?” అనేసిండు నాతో. అనుకున్నట్టే ప్రశ్నల వాన మొదలైంది.
“స్వీడన్‌”ఒక్కమాటలో సమాధానం రాయండి ప్రశ్నకు జవాబులా చెప్పిన.“ఏం పనిమీదొచ్చిండు?”“రీసర్చ్ చెయ్యడానికి”
కొద్దో గొప్పో చదువుకున్నట్టున్నడు పెద్దమనిషి. పైగా అప్పటిదాకా చదివినట్టు తన చేతిలో న్యూస్‌ పేపర్‌ చూస్తే తెలుస్తుంది. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి ఏం ఆలోచించుకున్నడో …తల ఒకవైపు వంచి ఓరచూపుతో “గంత దూరం నుండి ఈడికి ఏం రీసెర్చ్ చెయ్యనీకొచ్చిండు?”ప్రశ్నల వాన ఊపందుకుంది.
బెంగ్త్ గురించి పెద్ద మనిషికి పూర్తిగా తెలుసుకోవాలనిపించిందో, లేకపోతే తాను సదువుకున్నోనని తన పక్కనున్న వాళ్లముందు నిరూపించుకోవాలనుకున్నాడో ఏమో …!
ప్రశ్న ఎనుక ప్రశ్నేస్తనే ఉన్నడు.“క్యాస్ట్‌ డిస్క్రిమినేషన్‌ ఇన్‌ ఇండియన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌” అని తడబడకుండా చెప్పి పెద్దమనిషి దిక్కే చూసిన.
అర్థం కానీ కాకపోనీ చెప్పనైతే చెప్పిన. అర్థం అయీ కానట్టు తలాడించిండు పెద్దమనిషి.సరే అర్థమయ్యెటట్టు చెప్పుదామని మళ్లొకసారి తెలుగుల గూడ చెప్పిన.పెద్దమనిషి ఒక్క క్షణం గూడ ఆగకుండ -
“యహే గీ కాలంల క్యాస్ట్ గీస్ట్ ఎక్కడిది సార్‌?” పూర్తిగ లోతులు తెలిసినట్టు అన్నడు.“అదేంది సార్‌? అంటే ఏంది మీ ఉద్దేశం?” నాలో ఒక అగ్నిపర్వతం రగిలింది. కానీ అదిగూడ ప్రశాంతంగనే.పెద్దమనిషి నా ప్రశ్నను లైట్‌ తీసుకున్నట్టున్నడు.
“ఆ ఏమున్నది సారు, కాలం మారింది. గీ రోజుల్ల అందరు కలిసి సమానంగనే ఉంటున్నరు కదా? కింద కులాలోళ్లు కూడ మస్తు బాగుపడ్డరు. సదువుల్ల, కొలువుల్ల అన్నిట్ల మంచిగనే ఉన్నదంటున్న” .
ఆ మాటల్లోనే పెద్దమనిషి పెద్ద కులపోడని అర్థమైంది. ఆయన్లో కింద కులాలోల్ల మీద ఇంకెంత అక్కసు దాగుందో ఆ తరువాత మాటల్లో తెలిసింది.“మీరేమనుకోకుంటే ఓ ప్రశ్నడుగుతా?” అని మెల్లగా పర్మిషన్‌ తీసుకొని “మీ క్యాస్టేంది సార్‌?” అని పులితోకను గుంజినంత పని చేసిన.
“ఆ ఎందుకు సార్‌?” అనుకుంటనే “ఓ.సి” అని గల్లెగరేసినట్టు గర్రతో అన్నడు.ఊహించినట్టే కిటుకు తెలిసిపోయింది.“అదీ కతా, గందుకే మీరట్ల మాట్లాడుతున్నరు.”నా మాటకు పెద్దమనిషికి కోపం నశాలానికంటింది.
“ఎట్ల మాట్లాడుతున్నరు సారు? మీరే సూడుండ్రి. వాళ్లకు ఫీజులెవ్వాయె, గీజులెవ్వాయె. అంతా పుక్యానికేనాయె. ఎక్కడ పొయినా అన్నీ ఫ్రీయేనాయె. రిజర్వేషన్లు అన్నీ వాళ్లకే ఉండే …” గొంతు కొంచెం పెరిగింది. కింది కులాలోల్ల మీద పెద్దమనిషికి పీకలదాకా కోపం, ఓర్వలేనితనం ఉన్నయని అర్థమైంది.
కోపం మీదున్నోనికి ఆవేశంగా సమాధానమిస్తే మరింత కోపమొస్తదని గ్రహించిన.నెమ్మదిగా “సరేసారు, మీరన్నట్టు కింది కులాలోల్లంత బాగుపడ్డరనుకుంటే …
గీ దేశంల రాజ్యాధికారం ఎవలకున్నది?గీ దేశంల భూములు, సంపద ఎవరి చేతిలున్నయి?పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలు ఎవరి దగ్గరున్నయ్‌?
సదువుకున్న వాళ్లలో కింది కులాలోల్లెందరు? అగ్రవర్ణాలెందరు?ఉద్యోగాల్జేస్తున్నోలల్ల వీళ్లెందరు? వాళ్లెందరు? మీకు తెలుసా సార్‌?”లెన్త్ కొంచెం పెద్దయినా, పెద్దమనిషికి మాత్రం నిజం తెల్వాలన్నట్లు భారీ లెక్చరే ఇచ్చిన.
పెద్దమనిషికి బీపీ పెరిగినట్టున్నది. అయినా నలుగురి ముందు ఎనుకడుగు ఎయ్యొద్దని మేకపోతు గాంభీర్యాన్ని నటించడం మొదలుపెట్టిండు. అందరు చూస్తున్నరా ఏందని ఒకసారి అటీటు జరిగినట్టు చేసినంకా, గొంతు సవరించుకొని, “గిన్ని మాట్లాడుతున్నవ్‌, మీదే కులం?” అని చిట్టచివరి ఆయుధాన్ని ప్రయోగించిండు. అది గూడ సిన్మల విలనడిగినట్టే అడిగిండు.
“మేం మాదిగోళ్లం!” తుపాకి నుండి దూసుకపోయిన బుల్లెట్‌లా నా సమాధానం.నా నోటి నుండి ఆ మాటొచ్చే సరికి పెద్దమనిషికి నోటి మాట పడిపోయినట్టయ్యింది.గిప్పటిదాక గీ మాదిగోన్ని సారంటినా అనుకున్నడేమో?
“అరె మా కొడుకులెవనికి గింత తెలివి రాలేదెందుకయ్యా బాబు” కపట ప్రేమతో దీర్ఘం తీసిండు.నా కులం తెల్వంగనే నన్ను సార్‌ అనొద్దు అనుకున్నడని అర్థమైంది. మళ్ల పెద్దమనిషే శక్తినంత కూడదీసుకొని -
“బాబూ, మా ఊళ్ళెనైతే మాల మాదిగల్ని ఒక్క మాటనేటట్టు లేదు. ఏమన్నంటే ఎస్సి, ఎస్‌టి అట్రాసిటి కేసంట్రుండ్రు. ఎవ్వనేమనేటట్టు లేదాయే” విచారపడుతున్నట్టు అన్నడు.
ఆ కేసుల వల్ల పెద్దకులపు పెద్దమనిషికి ఎక్కడాలేని కష్టమైతున్నట్టు ఆయన మాటల వెనక ఓ నిగూఢార్థం.
“సరే సారు, మీరు కులంలేదు, కుల వివక్ష లేదంటున్నరు కదా! నేను మీ ఊళ్లె ఉంట. మీ ఇంటి పక్కన నాకు ఇల్లిస్తరా చెప్పుండ్రి?”నా ప్రశ్నకు బిత్తరపోవడం పెద్దమనిషి వంతయ్యింది.
మా సంభాషణ చూస్తున్న వాళ్లకు ఇంకాసేపట్లో ఇక్కడేదో యుద్ధం జరిగేట్టున్నదని రక్షణ మార్గాలను వెతుకుతున్నట్టున్నరు. పెద్దమనిషి మాత్రం ‘ఇప్పుడే వస్తా’ అనుకుంట టాయిలెట్‌కని లేసిండు.
పోతూ పోతూ “నీ యమ్మా అలగాజనం. ఎంతకు జరుగరు. దిక్కుమాలిన రిజర్వేషన్‌ దొరకక ఈ తంటాలు”జనాలు ఎక్కువుండేసరికి నా మీదున్న కోపాన్ని వాళ్లమీద చూపిస్తున్నడని నాకు అర్థంకానీకి ఎంతో టైం పట్టలేదు. అంతల్నే ఇంకొక ముసలాయన మా లొల్లంత ఇన్నట్టున్నడు.
“ఎన్కటున్నట్టు గిప్పుడైతే లేదుగని, పురాగ లేదనైతే అనలేము సారు” మనసుల మాట బైట పెట్టిండు.“నేనుగదే అంటున్న తాత, ఆ పెద్దకులపు పెద్దమనిషికి ధైర్యమొస్తలేదు” అనంగనే -‘ఏం చేస్తం తియ్‌’ అన్నట్టు తలూపిండు.
లోపలికి పోయి ఏమేం ఆలోచించిండో పెద్దమనిషి రెండోసారి యుద్ధంలో అడుగుపెట్టినట్టు వొచ్చిండు.నాతో వాదిస్తే ఓడిపోవుడు ఖాయమనుకున్నట్టు గొంతు తగ్గించి మాట్లాడుడు మొదలుపెట్టిండు.“ఇగొ నువ్వేమో మంచిగ మర్యాదగ మాట్లాడుతున్నవ్‌? మా ఊళ్లె మాదిగోళ్లను సూడు ఎట్లా మాట్లాడుతరో”
కరిగిపోతున్న పరపతిని గుర్తు చేసుకున్నట్లు పెద్దమనిషి మరో ఎత్తుగడతో అన్నడు. ఆ మాటతో నన్ను మినహాయించి, నా జాతిని దెబ్బతీయాలనుకున్నడా అనుకున్న.
“మాట అనేది మనం ఇతరులకిచ్చే మర్యాదను బట్టి ఉంటదండి” అని ఇంకేదో చెప్పబోతుంటే పెద్దమనిషి ఉడికిపోయి “నువ్వు ఎన్ని చెప్పిన కులం మాత్రం గిప్పుడులేదనే నా గట్టి నమ్మకం” తెగేసి చెప్పిండు.తను దిగే స్టేషన్‌ వచ్చింది కాబట్టి తన మాట నెగ్గించుకోవాలనుకున్నట్టున్నడు. అందరం నిశ్శబ్దంగా గీయన మారడని నిశ్చయించుకున్నట్లు కూసున్నం. బెంగ్త్ అన్ని అబ్జర్వ్‌ చేస్తున్నడు కానీ అర్థమవుతున్నట్టు లేదు. ఆ తరువాత జరిగిన బాగోతాన్నంతా అనువదిస్తుండగా పెద్దమనిషి భారత కులవ్యవస్థను మరోసారి నిరూపించిండు.“ఒరే మల్లయ్య ఏడున్నవురా?” అని గద్దించిండు.అప్పటిదాక డోర్‌కాడ కూసున్న మనిషొకడు పరుగున పెద్దమనిషి దగ్గరికొచ్చిండు.
“దొరా వస్తిని, వస్తిని” అనుకుంట పెద్దమనిషికి సంబంధించిన సంచులు, సామాన్లు నెత్తిన పెట్టుకుని పెద్దమనిషి ఎనుకాలే అడుగులేసిండు.బెంగ్త్‌కి విషయమంత అర్థమైనట్లుంది. ట్రైన్‌ దిగుతున్న దొరను చూసి -“వేర్‌ ఎవర్‌ యూ గో ది క్యాస్ట్‌ ఫాలోస్‌ ఇన్‌ ఇండియా” అన్నడు.మా ఇద్దరి ముఖాల్లో చిన్న చిరునవ్వు మెరిసింది. మరో యుద్ధం కోసమన్నట్టు ట్రెన్‌ కదిలింది. (2009, ఆదివారం ఆంధ్రజ్యోతి సౌజన్యంతోటి) - పసునూరి రవీందర్‌

Thursday, December 17, 2009

తెలంగాణవాదం ఇంట్ల శురుగావలె !

అందరికి చెప్పే ముందు మన ఇంట్ల, మన ఒంట్ల శురుగావలె అంటారు , అవును అది నిజం బై!
తమ్మి మొదలు మనం శురు చెయ్యాలే ! మన ఇంట్ల శురు కావలె.. చెప్పుండ్రి మీ ఇంట్ల "అవ్వా! ఇంట్ల కెళ్ళి బయటికి బోతన్న. నౌకర్ల కోసం, మన తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధులకోసం, కొలువుల కోసం, అందరం ఒక్కటైయెటట్లు జేస్తం. శెల్లే! ఇగవోతరా బై. మనకోసం మనం తయారయ్యేటట్లు జేస్త. మన బతుకులకు, మన తెలంగాణకు నా వొంతు నేను శాతనైన కాడ్కి పేరు నిలవెడ్త"
మనకు చరిత్ర దెల్సు. యిత్తేసి పొత్తుగూడినోడు పొయిమీది కుండను మాయం జేత్తండు. మనం వొండుకున్నది మనకు వెట్ట వాడెవడు. మన పొయి మంటను గుంజుకున్నడు. యిపుడు మండేది పెయి మంట. అదే కడుపుల ఆకలి మంట. గా మంట సల్లార్పెతందుకు ఎన్నడో ఒగనాడు మంచి కాలమొత్తది. గదేందో మనమే సురువుజేస్తే ఐపోతది గదా.
మీ సంకల్పం మంచిదైతే శక్తి దానంతట అదే ఉద్భవిస్తది!
ఎందుకురాదూ? గడ్డిని తాడువడితే ఆ తాడు గడ్డామును ఆగవడ్తది గాలికి ఇటు అటు కొట్టుకపోకుంట. గట్టిగ పిడికిలి వట్టి యీడిసి గుద్దితే సచ్చెదాక దెబ్బలేకుంట యాదుంటది. అంతకన్నా అడివా...? ఒగొలు చెప్పిన బుద్ది అప్పట్ది. మీ బుద్ది ఎప్పట్ది. మేం మత్తుగ అంటం గుడ్డెద్దు శేన్లవడ్డట్టు. ఇదే ఏ పని జేసినా కాయంగా జేసుకుంటేనే బతుకుతరు...లేకుంటే ఎప్పటి శిప్ప యేన్గులనే!
గంట కన్నా అద్వానామ మనం! ఇడిచి ఇడిచి కొట్టున్ద్రి ఆంధ్రోల్లను! మా కి కిరి కిరి !!
గీసొంటి మాటలు మన పానం లెక్క గుండెల ఉండాలే తెలంగాణా కోసం పోరాడాలే !!
ఓ అన్న, ఓ అక్క, ఓ తమ్మి, ఓ కాకా, ఓ అత్తమ్మ, ఓ చిన్నయ్య ఇంటున్ద్రా!
జై తెలంగాణా జై జై తెలంగాణా!!

వరంగల్ ప్రయాగ!

ఉద్యమంపై వ్యాఖ్యానించే ముందు ఒక్క క్షణం

ఒక వైపు మహోధృతంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమంలో మా భూమిపుత్రులు తమ ప్రాణాలు తామే అర్పించుకుంటుంటే కొందరు సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకులు బ్లాగుల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. తెలంగాణా ఉద్యమం ఎందుకు జరుగుతుందో అనేక సార్లు వివరించినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయని వీరు కేసీఆర్ ను విమర్శించే నెపంతో తెలంగాణా ప్రజలను దూషిస్తున్నారు.
విధ్వంసం విధ్వంసం అని గుండెలు బాదుకుంటున్నవారు ఒక సారి అలోచించండి ఇప్పటికే 25 మంది యువకులు తెలంగాణ కొరకు తమ ప్రాణాలు తామే తీసుకున్నారు. తమ దేహాలను అగ్నిగోళాలుగా మార్చుకుని “జై తెలంగాణా” అని నినదిస్తున్నారు, ఉరి తాళ్లను ముద్దాడుతున్నారు, బుల్లెట్లను గుండెల్లో దింపుకుంటున్నారు, గరళాన్ని దిగమింగుతున్నారు, రైలు పట్టాలపై శిరచ్చేధం చేసుకుంటున్నారు, సెల్ టవర్లు, నీటి ట్యాంకులపై నుండి “జై తెలంగాణ” అని దుంకుతున్నరు.
ఇంకొక ప్రాణం కూడా వృధా కావొద్దు అని మేము ఇక్కడ విజ్ఞప్తులు, విన్నపాలు చేసుకుంటున్నాం.
మీకొకటే విజ్ఞప్తి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అందరికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉందీ దేశంలో. సమైక్య రాష్ట్రం ఎందుకు అవసరమో తప్పకుండా మీ అభిప్రాయాలను రాయండి. సమైక్యత సాధించడం కొరకు చేయాల్సిన కృషి తప్పకుండా చేయండి. కానీ ఒక్క నిముషం అలోచించండి. అసలే అవేశాలు రగులుతున్న ఈ సమయంలో మీరు చేసే ఈ అనాలోచిత వ్యాఖ్యలు వాతావరణాన్ని ఇంకా కలుషితం చేస్తాయి. అమెరికాలోనో, కెనడాలోనో కూర్చుని మీరో వెకిలి వ్యాఖ్య చేసి మీ నోటి కుతి తీర్చుకుని ఆనందపడవచ్చు. కానీ అలాంటి వ్యాఖ్యలు ఒక్కోసారి బడబాగ్నిని రగల్చవచ్చు. అది అమాయకులనే దహించివేస్తుంది.
అలాగే తెలంగాణా వాదులు కూడా సంయమనం పాటించాలి. ఆంధ్రా మిత్రులను దూషించి అనవసరంగా మన ఉద్యమంపై దురభిప్రాయం కలుగజేయరాదు. మన పోరు కోస్తాంధ్ర పాలకవర్గాలతోనే కానీ కోస్తాంధ్ర ప్రజలతో కాదని గుర్తెరగాలి.
సమైక్య రాష్ట్రం ఉండాలనుకోవడం తప్పుకాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ప్రజా ఉద్యమం. దీనిపై దయచేసి వెకిలి రాతలు రాయకండి.
మీకు ధ్వంసం అవుతున్న ఆస్థులు కనపడుతున్నాయి. మాకు ధ్వంసం అవుతున్న తెలంగాణా భవిష్యత్ తరంపై ఆందోళనగా ఉన్నది

Wednesday, December 16, 2009

అవ్వా ! నేను బోథనే !

అవ్వా నేను బోథనే తెలంగాణా లోల్ళీ లోకి - అయ్యా నేను వెళ్తానే తెలంగాణా పోరు లోకి
కర్ణగూరం పోరు గడ్డ పంపుతుంది కళాకారులను - నిజంబాద్ నిప్పురవ్వ తొలుతుంది పోరగాండ్లను
అద్‌లబాద్ అడివిగడ్డ దింపుతుంది తన బిడ్దలను - ఖమ్మం మట్టినుండి కదులుతుండ్రు కార్మిక అన్నలు
అవ్వా నేను బోథనే తెలంగాణా లోల్ళీ లోకి - అయ్యా నేను వెళ్తానే తెలంగాణా పోరు లోకి
ఓరుగల్లు ఖిల్లా నుండి గజ్జ కట్టి దూనుకుతుండ్రు అక్కా చెల్లెళ్ళు - మెదక్ పల్లెల్ళ నుండి జై కొడుతుండ్రు అన్నా తమ్మూండ్లు రణబిడ్దలు రైతన్నలను వదులుతుంది - రంగారెడ్డికరువు కన్నీళ్లను దాచుకుని పద పద మంటూ ఉరుకుతుంది మైబుబ్‌నగర్ అవ్వా నేను బోథనే తెలంగాణా లోల్ళీ లోకి - అయ్యా నేను వెళ్తానే తెలంగాణా పోరులోకి
లక్ష్మి నరశింహులై ఉప్పెనల వస్తుంది కొండా నల్లగొండ - తెలంగాణా గుండె కాయ హైదరాబాదు సై సై మంటూ సైరన్ మోగిస్తుంది అవ్వా నేను బోథనే తెలంగాణా లోల్ళీ లోకి - అయ్యా నేను వెళ్తానే తెలంగాణా పోరు లోకి

దోపిడి చేసే ప్రాంతేతరులను...

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం
దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం
తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం మునుగును తానే - మునుగును తప్పక
-కాళోజి

Tuesday, December 15, 2009

ఎవరు ఎం అంటున్నారు?

అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా — గద్దర్

యాసను భాష ఎక్కిరిచ్చింది తెలుగును చూసి ఇంగ్లీష్ ఇకిలిచ్చింది — అన్నవరం దేవేందర్

జో జిస్సే మిలా సీఖా హమ్‌నే - గైరోంకో భీ అప్నాయా హమ్‌నే’ (ఎవర్ని కలిసినా వారి నుండి నేర్చుకున్నం - పరాయివారిని కూడా మా వారిగా చేసుకున్నం) ఇది హైద్రాబాద్‌ గొప్పతనం ! — సలాం హైద్రాబాద్

పొక్కిలి అయిన తెలంగాణ మీద… ఈ తూట్ల వర్షం ఎందన్నా ? — జయప్రకాశ్ తెలంగాణ

వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది — కాళోజి

నవంబర్ ఒకటి గడ్లె కలిపిన రోజు యాదికస్తే యాన్నో కాల్సుకస్తది — అన్నవరం దేవేందర్

తెలంగాణ వేరైతేచెలిమి తుట్టి పడుతుందా?తెలంగాణ వేరైతేచెలిమి లెండిపొతాయా?… తెలంగాణ వేరైతేదేశానికి ఆపత్తా? - కాళోజి

అవతరణ నాటి కటిక చీకటి చెప్పకుంటే ఎట్ల తెల్లార్తది — అన్నవరం దేవేందర్

రైతు రైఫిలై నిజాం మీద పోరాడిన నేల యిది వారసత్వం నడుస్తాంది — అన్నవరం దేవేందర్

ఆత్మ గౌరవాన్ని ఎట్లా ప్యాక్ చేస్తావ్ ? — అన్నవరం దేవేందర్

కళలకే పుట్టుక నా తెలంగాణా, నా తెలంగాణాపాటగాచిన పట్టు నా తెలంగాణా , నా తెలంగాణా — నందిని సిధా రెడ్డి

ఇక్కడి మన్నుముర్క సూస్తే పోరాటం వాసన పొటమరిస్తది — అన్నవరం దేవేందర్

ఎవల అవ్వ భాష వాళ్ళకు బువ్వ — అన్నవరం దేవేందర్

నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా,నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా — నందిని సిధా రెడ్డి

అగర్‌ కిసీ ఖౌమ్‌ కో బర్బాద్‌ కర్నాహైతో పహెలే ఉస్‌కీ జబాన్‌ కీంచ్‌లో అన్న నానుడిని తెలంగాణలో నిజం చేసినారు. - పరవస్తు లోకేశ్వర్‌ హైద్రాబాదీ

పొక్కిలి అయిన తెలంగాణ మీద… ఈ తూట్ల వర్షం ఎందన్నా ? — జయప్రకాశ్ తెలంగాణ

నేనురా తెలగాణ నిగళాలు తెగగొట్టి ఆకాశమంత యెత్తరచినాను — దాశరధి

సమైఖ్యంగా ఉందాం అని ఇట్ల ‘ధ్వంస రచన’తోటా చెప్పేది ? ఇదేనా సంయమనం తోటి ఉద్యమాలు చేసుడంటె ?

తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా?

తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా? తెలంగాణ క్రెడిట్ కేసీఆర్‌కు దక్కకూడదనుకొంటోందా? తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం ద్వారా కాంగ్రెస్ నేతలు లాభం పొందాలనుకుంటున్నారా?తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు చూసినా.. తెలంగాణ ఉద్యమ చరిత్రను పరిశీలించినా.. అందరికీ సహజంగానే కలిగే సందేహాలివి. మూడు దశాబ్దాల క్రితం మొదలైన తెలంగాణ పోరాటం కూడా.. కాంగ్రెస్ నేతల పన్నిన కుట్రలతోనే నీరుగారిపోయింది. పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు పర్చాలంటూ.. 1969 జనవరి 9న ఖమ్మంలో ఓ విద్యార్థి నిరహారదీక్షకు దిగడంతో.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలయ్యింది. ఇది క్రమంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. వీరి చొరవతోనే.. తెలంగాణ ప్రజాసమితి ఏర్పడింది. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం మొదలైనా.. మధ్యలో మర్రి చెన్నారెడ్డి, కె.వి.రంగారెడ్డిలతో పాటు.. మరికొంతమంది నేతలు కూడా ఇందులో చేరడంతో.. రాజకీయ రంగు పులుముకొంది. జనవరి నుంచి.. సెప్టెంబర్ వరకూ కళాశాలలను.. తరగతులను వదిలి విద్యార్థులంతా ఉద్యమంలో పాల్గొన్నారు. మార్చి నుంచి తీవ్రరూపం దాల్చిన ఈ ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో, అగంతకుల దాడుల్లో దాదాపు 370 మంది బలయ్యారు. ఏప్రిల్ ఆరో తేదీన టీపీఎస్ హైదరాబాద్‌లో నిర్వహించిన ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లోనే యాభై మందికి పైగా విద్యార్థులు మరణించారు. ఈ కాల్పుల తర్వాత.. తెలంగాణలో హింసాత్మక ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. మరో రెండేళ్ల పాటు సాగిన తర్వాత.. 1971 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణలోని పది స్థానాలను గెలుచుకొని టిపీఎస్ చరిత్ర సృష్టించింది. కాకపోతే.. దేశవ్యాప్తంగా ఇందిరా కాంగ్రెస్ ఘన విజయం సాధిచండంతో.. టిపీఎస్‌ను ఆమె లెక్కచేయలేదు. ఇదే సమయంలో చెన్నారెడ్డి టిపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో.. ప్రత్యేక పోరాటం ముగిసిపోయింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్న వాదనను.. ఇప్పటి సీనియర్లు అంగీకరించడం లేదు. ఇతర పార్టీలే ప్రజలను మోసం చేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెబుతున్నారు. ఇలాంటి ఉద్యమాలు కాంగ్రెస్‌కు అలవాటేనంటున్నారు. ఇక కాంగ్రెస్‌లోనే కొంతమంది నేతలు చేస్తున్న ప్రకటనలూ.. సీనియర్ల తీరుపై అనుమానాలను కలుగ జేస్తున్నాయి. తెలంగాణలోని కొంతమంది నేతల వల్లే తెలంగాణ రావడం లేదంటూ నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి ఆరోపణలు గుప్పించారు. ఇతర పార్టీల్లోని తెలంగాణ నేతలూ కలిసికట్టుగా పోరాడితే తప్ప ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదంటున్నారు. అంతేకాదు.. తెలంగాణ ఉద్యమంలో భాగం కావాలనుకుంటున్నారే తప్ప.. లీడ్ తీసుకోవడానికీ కాంగ్రెస్ సీనియర్లు సిద్ధంగా లేరు. అధిష్టానంతో పోరాడి.. ప్రత్యేక రాష్ట్ర్రాన్ని సాధించాలన్న ఆలోచనా లేదు. సోనియాగాంధీకి విన్నవించుకోవడం తప్ప.. డిమాండ్ చేసే అవకాశమే లేదు. పైగా వారిలో వారికే ఎన్నో భేషజాలు.. మరెన్నో అభిప్రాయ భేదాలు. అధిష్టానం దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకోకూడన్న ఆలోచనలు.. వీటి మధ్య.. ఢిల్లీ వెళ్లి వీరంతా కలిసికట్టుగా పోరాడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. మొత్తం మీద చూస్తుంటే.. ఉద్యమం క్రెడిట్ ఒక్క టిఆర్‌ఎస్‌కు .. అందులోనూ కేసీఆర్‌కు మాత్రమే దక్కకూడదనే.. కాంగ్రెస్ నేతలు మళ్లీ గళమెత్తడానికి కారణంగా కనిపిస్తోంది. శాసనమండలిలో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఇదే అభిప్రాయానికి వచ్చారు. ఉద్యమాన్ని మరోసారి హైజాక్ చేయడానికి సిద్ధమవుతున్నారు..